ఇది మొదలెట్టింది,
కొందరు “కుహానా” స్త్రీవాదులు, “రామాయణం పురుషాధిపత్యానికి చిహ్నం”అని చేసే
వెర్రి మొర్రి వాదనలకి రిటార్డుగా. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రక్కదోవ పడితే,
తెలియజేయాల్సిందిగా మనవి.
రామాయణం, పురుషాహంకారానికి చిహ్నం అంటారు,
కుహానా స్త్రీవాదులు. రామాయణం పెట్టుబడిదారీ వ్యవస్థకి చిహ్నం అంటారు,
కుహానా కమ్యూనిస్టులు. రామాయణం లేనే లేదు, అదంతా
వట్టి కల్పన అని పదే పదే వల్లె వేస్తూ ఉంటారు,
కుహానా హేతువాదులు. రామాయణం ద్రవిడులపై ఆర్యుల అరాచకాలకి ప్రతీక,
రావణుడు ద్రవిడుడు, దళితుడు అంటారు,
కుహానా దళితవాదులు. రామాయణంలోని రక్కసులే ఆంధ్రోళ్లుగా పుట్టరంటాడు ఓ కుహానా
తెలంగాణవాది. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతీ ఉద్యమానికీ తేరగా దొరికింది రామాయణమేనని,
అనిపించక మానదు. అసలు ఈ కుహానావాదులు, వారి వాదాల గురించి ఒక టపాని సిద్ధం
చేస్తున్నాను. వీళ్లెవరు..? వీళ్ల లక్ష్యాలేమిటి..?
లాంటివి అక్కడ మాట్లాడుకుందాం..! ముందే చెప్పుకున్నట్టు,
కుహానా స్త్రీవాదులే ఇక్కడ నా టార్గెట్.
“సీత”ని అగ్నిప్రవేశం చేయమన్నాడనీ, ఎవడో
తాగుబోతు పౌరుడు వాగితే, మళ్ళీ వదిలేసాడనీ, ఇది
పక్కా మగ దురహంకారమనీ, హుంకరిస్తుంటారు కదా. ఇక్కడ నేను రాస్తున్న
“మగవారిమీద వివక్ష”లని చదవండి, ఈ సమాజం మగవారిపైన ఎంత వివక్ష చూపుతోందో
అర్థమౌతుంది. ఇలాంటి వాటిని, తెలుగువారం “రామాయణంలో పిడకలవేట” అంటున్నాం.
ఇక్కడ జరిగే పిడకల వేట “మగవారిమీద వివక్ష” పిడకలకోసం అన్నమాట.
మొదటి పిడక: పరాయి ఆడదాని వెంటపడినందుకు రావణుడు,
సర్వనాశనమైపోయాడు. చివరికి చచ్చాడు కూడా. మరి పరాయి మగాడి వెంట పడినందుకు
శూర్పణఖని ఎందుకు చంపలేదు.? ముక్కు, చెవులు కోసేసాడు లక్ష్మణుడు,
అంతే..! రావణుని పిల్లలూ చచ్చారు, శూర్పణఖ పిల్లలూ చచ్చారు. అంతవరకూ వివక్షలేదు. ఆ
తర్వాత, రావణుడు చచ్చాడు, కానీ
శూర్పణఖ చావలేదు. ఒకే తప్పుకి ఆడదానికొక శిక్ష,
మగవాడికొక శిక్ష. నోట్ దిస్ పాయింట్ యువరానర్..!
రెండవ పిడక: సీతాపహరణం తర్వాత,
రాముడు సీతకోసం గాలించాడు, సుగ్రీవుడితో చెలిమికోసం వాలిని చంపాడు,
వానరులనందరినీ సీతాన్వేషణకోసం పంపుతూ, ఉత్తగా వచ్చినవారికి ప్రాణభయం
కలిగించాడు (ఆ పని చేసింది సుగ్రీవుడు లెండి),
హనుమంతుడి చేత సముద్రం దూకించి లైఫ్ రిస్క్ తీసుకునేలా చేసాడు, ఆ
తర్వాత కడలికి వంతెన కట్టి, రాక్షసులతో పోరాడు. ఇలా నానా కష్టాలూ పడితే, సీత
ఏం చేసింది అని నేను అడుగుతున్నాను. నగలు దాచమని హనుమంతుడికి ఇవ్వడం తప్ప. అదీ
గాల్లోంచి విసిరేసింది..! ఇది వివక్ష కాదా..? పోనీ
రావణుడు బంధించేసాడు కాబట్టి, ఏమీ చేయలేకపోయింది అనుకుందాం. హనుమంతుడు రాముని
దగ్గరకి చేరుస్తానన్నప్పుడైనా, వచ్చి ఉండొచ్చుగా.. ఊహూఁ..! నా స్వామే వచ్చి
నన్ను విడిపించాలి అని ఇంకో రెండు పద్యాలూ, శ్లోకాలూ పాడింది. హనుమంతుడు
చెప్పినట్టు చేసి ఉంటే, ఎంతోమందికి చావుతప్పి ఉండేది. ముఖ్యంగా,
అన్నెం పున్నెం ఎరుగని కుంభకర్ణుడు లాంటి వాళ్లు, ఏ
తప్పూ చేయకపోయినా చచ్చారు. పైగా, అతగాడు జయవిజయుల్లో ఒకడని దానికి జస్టిఫికేషనూ..!
మూడవ పిడక: అదలా ఉంచితే,
జనామోదం పొందిన రాముణ్ణి యువరాజు
కానివ్వకుండా అడ్డుపడింది కైకేయి. అదీ మొగుణ్ణి బాధపెట్టి మరీనూ. కాదంటే “ఆడినమాట
తప్పినవాడివి అవుతావ”ని బెదిరింపులు. ఇది గృహహింస కాదా..? అని
అడుగుతున్నాను. ఆ బాధ భరించలేక, పాపం దశరధుడూ పోయాడు. దానికి జస్టిఫికేషను కోసం
ఇంకో కథ.! అంతే తప్ప కైకేయిని, కన్నకొడుకు భరతుడు తప్ప ఇంకెవ్వరూ శిక్షించిన
దాఖలా కనబడదు, అదీ మొహం చూడనంటాడు అంతే..! మరి
భరతుడో., ఆవిడకి పుట్టినందుకు తనకు పితృతర్పణాలు పెట్టే
అర్హత లేదని తండ్రి దగ్గర్నుండి శాపాన్ని పొందాడు. అంటే ఓ ఆడదాని వల్ల ఒక మగాడు
పోయాడు, ఇంకో మగాడు జీవితాంతం బాధపడ్డాడు. దీనికి
శిక్షలు లేవు. ఇది వివక్ష కాదా..? నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువరానర్..!
నాలుగవ పిడక: “తాటక” అనే రాక్షస స్త్రీని చంపాడు
రాముడు. దశరధుడితో బాటు యుద్ధానిక్కూడా వెళ్ళి ఎంతోమంది రాక్షసులని చంపింది
కైకేయి. మరి “ఆడదాన్ని చంపినవాడ”ని రాముణ్ణి వెక్కిరించినట్టుగా,
“మగాణ్ణి చంపినద”ని కైకేయిని ఎవరూ వెక్కిరించలేదే..?
రాముణ్ణి చివరికి కన్నకొడుకులు కూడా వెక్కిరించారు. ఇక్కడ పాయింట్
“వెక్కిరింపు”కాదు, ఆ వెక్కిరింపుకి గల కారణం యువరానర్..! యుద్ధంలో, ఆడది
మగాణ్ణి చంపితే సమాజం ఒప్పుకుంటుంది. అదే యుద్ధంలో, మగాడు
ఆడదాన్ని చంపితే ఒప్పుకోదు. ఇదెక్కడి అన్యాయం..?
ఐదవ పిడక: బంగారు లేడిని తెమ్మనగానే,
పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయిన రాముడికి, ఏ అపాయమూ రాదనీ, ఆయన
మహావీరుడనీ, కంగారు పడవద్దని తల్లిలాంటి వదినకి
నచ్చజెప్పబోయిన లక్ష్మణుణ్ణి సూటిపోటి మాటలతో బాధపెట్టింది సీతమ్మ. ఎంత బాధపడ్డాడో
పాపం లక్ష్మణుడు, చివరికి అన్నగారిమాటని కూడా కాదని పాక( పర్ణశాల
అంటె ఘనంగా ఉంటుందేమో..!)ని విడిచివెళ్లాడు. ఇక్కడ రెండు పాయింట్లున్నాయి యువరానర్..!
ఒకటి లక్ష్మణుడికి జరిగిన గృహహింస. రెండోది, తను
గీసిన గీతని దాటొద్దని లక్ష్మణుడు చెప్పినా,
వినకుండా “నీ లెక్కేమిటిలే నాకు..?” అని దాటిన సీత దురవగాహన. ఇక్కడ సరైన పదం
చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు.
ఆరవ పిడక: సీతని
రావణుడు ఎత్తుకుపోతూంటే, పోరాడి నేలకొరిగినవాడు జటాయువు. ఎంగిలి పళ్ళని
నివేదించి, సుగ్రీవుణ్ణి కలవమని సలహా ఇచ్చింది, శబరి.
వీరిలో ఎవరికి ఎక్కువ విలువనివ్వాలి..? ఏమో మరి..! రాముణ్ణి చూసే
నేర్చుకోవాలంటారు, కనుక ఆడవాళ్లకే ఎక్కువ విలువనివ్వమంటారా..? చట్టం
ఒప్పుకోదు. శబరిని నది అయి, అందరికీ ఇలాగే సేదదీర్చమని అన్నాడు రాముడు. మరి
జటాయువో, ఈయన దశరధుని మిత్రుడుకూడానూ..! దహన సంస్కారాలు
చేసాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతున్నాను యువరానర్. ఆడదానికొక రీతి,
మగవాడికి అందునా ఒక పక్షికి ఇంకో రీతి అన్నమాట..! ఎక్కడ “పెటా”వాళ్ళు..?
వీధికుక్కల్ని, ఊరపందుల్నీ కాపాడింది చాలు.! జటాయువుకి న్యాయం
జరగాలని పోట్లాడండి..! పొండి..!
ఏడవ పిడక: రామాయణంలోని మనుషులకే కాదు,
రాసినవాళ్లకి కూడా గృహహింస తప్పలేదు. కుటుంబం కడుపు నింపడానికి వేటనే నమ్ముకొని,
వేటాడిన జంతువుల్నీ, మనుషులనీ చంపిన పాపంలో పాలు పంచుకుంటుంది తన ఆలి, అనీ ఆశించిన
బోయవాణ్ణి, మోసం చేసింది అతని పెళ్లాం. పాపం మొగుడిది
మాత్రమేనని, పాపం చేసి సంపాదించిన తిండి మాత్రం ఇద్దరిదీనని, ఆవిడ పెనుగువ(వాదన)లాడినందువల్లనే
ఆ బోయవాడు, సంసారాన్ని వదిలేసి పోయాడు. (ఇప్పటి
చట్టాలద్వారా జరుగుతున్నదీ అదే కదా..! అయితే, ప్రతీ
అభాగ్యుడూ ఋషి అవ్వలేడు..) చివరికి మనకా విషయం చెప్పి ఆడవాళ్లు అప్పుడూ,
ఇప్పుడూ ఒకటేనని నిరూపించాడు వాల్మీకి. మగవాళ్లపైన ఇంత వివక్షా..?
దీన్ని తెగనాడుతున్నాను యువరానర్..!
హమ్మయ్య..! విజయవంతంగా ఐదారు పిడకల్ని
సంపాదించాను. వీటితో చేసిన “పిడకల దండ”ని కుహానా స్త్రీవాదులకు బహూకరిస్తున్నాను.
ఈ పిడకలు సరిపోవు అంటారా..? ఏం చేస్తాం..? నాకు
“గొల్లపూడివారి బాలల బొమ్మల రామాయణం”, చందమామలలో చదివినవాటిలోనూ,
సినిమాల్లో చూసినవాటిలోనూ గుర్తుండి, వేటాడగలిగిన పిడకలు ఇవే మరి..! అసలు
వాల్మీకి రామాయణం పూర్తిగా చదివితే, ఇంకొన్ని “మగవారిమీద వివక్ష” పిడకలు దొరకచ్చు. ప్రస్తుతానికి
ఇవే పిడకలు.. సర్దుకుపొండి..!
లేదా ఇంకొందరు వేటాడగలిగిన “కొత్త” పిడకలకోసం
ఎదురు చూడండి..!