27, మార్చి 2012, మంగళవారం

పట్టభద్రుల ముక్కుపిండేస్తున్న సంస్థలు - 1

ఉద్యోగార్థులను కొలువులనిచ్చే సంస్థలు ఎంతలా రాచిరంపాన పెడుతున్నాయో చాలామందికి తెలుసు. అయితే, ఈ “రంపపు కోత”లు సంస్థ సంస్థకీ, అభ్యర్థి అభ్యర్థికీ మారిపోతూ ఉన్నాయి. దాని గురించే ఈ టపా..! మరి “పట్టభద్రులు” అని శీర్షిక ఎందుకు చెప్మా..? అని అనుమానం వచ్చే ఉంటుంది. నేను రాద్దామనుకుంటున్నది ఉద్యోగార్థుల గురించేకాక ఉన్నతవిద్యాభిలాషుల గురించి కూడా. ఉన్నత విద్యని అభ్యసిద్దామనుకుంటున్నవారిని దేశీయ విశ్వవిద్యాలయాలు, అవి నిర్వహించే పరీక్షలు ఎంతగా ఏడిపిస్తున్నాయో(ముఖ్యంగా డబ్బు విషయంలో) రాయాలనిపించింది. ఎప్పట్నుంచో రాద్దామనుకుంటూ ఉన్న ఈ ఆలోచనకి ఇప్పుడు అక్షరరూపం వస్తోంది. ముందుగా ఉద్యోగార్థుల గురించి చర్చిద్దాం. 

ఉద్యోగార్థులు:
మరీ జనరలైజ్ చేసి చెప్పేకన్నా ఉదాహరణలు చూపిస్తే బావుంటుందని అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఉద్యోగ ప్రకటనలు చూద్దాం.
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సుమారు 345 కొలువులివ్వడానికి ప్రకటన ఇచ్చింది. దాని లంకె ఇది.
దరఖాస్తు రుసుం వివరాలు.

పరీక్షా కేంద్రాలు (మన రాష్ట్రం ): హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ.
సెంట్రల్ మానుఫేక్చరింగ్ టూల్ ఇన్స్టిట్యూట్
సెంట్రల్ మానుఫేక్చరింగ్ టూల్ ఇన్స్టిట్యూట్,  అప్రెంటిస్ ఆఫీసర్లకోసంఇచ్చిన ప్రకటన ఇది.
సాధారణ అభ్యర్థులకు రుసుం 300; ఎస్సీ,ఎస్టీలకు150.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేంకింగ్ పర్సనల్ సెలక్షన్
సుమారు 19 బేంకులలో కొలువులకోసం పరీక్షలు నిర్వహించే “ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేంకింగ్ పర్సనల్ సెలక్షన్” ఇటీవల ఇచ్చిన ప్రకటన ఇది.
దరఖాస్తు రుసుం: సాధారణ అభ్యర్థులు 450/-, ఎస్సీ,ఎస్టీలు 50/-
పరీక్షా కేంద్రాలు (మన రాష్ట్రం ): హైదరాబాద్ 

ఈ మూడు ప్రకటనలు మచ్చుకి ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలలో  ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పక్కకిపెట్టేసినా, ఈ తరహా విభజన దానితోనే ఉండిపోలేదు. ఎస్సీ,ఎస్టీలకి ఫీజులు తగ్గించి, అదంతా సాధారణ అభ్యర్థుల నెత్తిమీద రుద్దడం లాంటివి సర్వసాధారణం. అన్ని ఉద్యోగ  పరీక్షలలోనూ ఇదే తంతు. ఈ తంతు ముందునుండీ ఉందో లేదోనని నేను  చూడలేదు కానీ ఉండే ఉంటుందని అనుకుంటున్నాను.  

ప్రతీ సంస్థా ప్రకటన ఇచ్చేయడం దానికి 500, 1000 రూ. వరకూ దరఖాస్తు రుసుంలు పెట్టేయడమూను. అభ్యర్థికయ్యే ఖర్చు దానితోనే పోదు, ఇతరత్రా ఖర్చులు చాలానే ఉంటాయి. పరీక్షాకేంద్రానికి రానూపోనూ అయ్యే ఖర్చూ; అప్లై చెయ్యడానికి ఇంటర్‌నెట్ ఖర్చూ (అభ్యర్థుల్లో సింహభాగం సైబర్ కేఫ్‌లనుండే అప్లై చేస్తారు. ), అటెస్టేషన్(Attestation)చేయించడం తప్పనిసరిచేస్తే దానికోసం గెజిటెడ్ ఆఫీసర్ల చేతులు తడిపే ఖర్చూ; ఫొటోలు, సంతకాల స్కానింగుల ఖర్చులూ (ఇవి ఎలాగూ తప్పదు. తప్పుపట్టనూ లేము.) ఇలాంటివన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పరీక్షకీ ఎంత లేదన్నా 1000 రూపాయల వరకూ మంచినీళ్లలాగా ఖర్చైపోతాయి. అంత ఖర్చుతో ఎన్నిసంస్థలకని దరఖాస్తులు పంపగలరు..?  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంకా చాలా నయం.. ప్రయాణఖర్చులన్నా సంస్థలు భరిస్తాయి. (చాలామందికి పక్కనోడిని చూస్తే ఏడ్వాలనిపిస్తూ ఉంటుంది. నేనూ అంతే..! )

జాతీయస్థాయి పరీక్షల్లో ఎక్కువ శాతానికి మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్టణాలు మాత్రమే పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి. కొన్ని సంస్థలకి ఇవి కూడా ఉండవు. రుసుం మాత్రం అదే. పోనీ రాష్ట్ర స్థాయి పరీక్షలేమన్నా  వీలుగా ఉంటాయా అంటే అవీ లేవనే చెప్పుకోవాలి. హైదరాబాదు, విశాఖలకి తోడు విజయవాడ,తిరుపతి,వరంగల్ మాత్రమే అదనంగా ఉంటాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించే పరీక్షలు తక్కువేనని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో జోనల్ కోటాలు అదనం. కొన్ని జోన్లలో తొక్కిసలాటలూ, మరికొన్ని జోన్లలో ఈగలు తోలుకోవడమూ మామూలు విషయమే. అయితే,వీటికి ప్రాంతీయ నేపథ్యం రావడం వల్ల ఈ విషయం రాజకీయమై కూర్చొంది. కాబట్టి, దాన్ని పక్కనబెడదాం. 

సంస్థలకి,  పరీక్షల నిర్వహణా సమస్యలు ఉండొచ్చుగాక అంతమాత్రానికీ నిరుద్యోగులని డబ్బులపేరుతో ఇబ్బంది పెట్టడం దేనికి.? నిర్వహణ అంత ఇబ్బంది అయినపుడు ప్రత్యేకంగా పరీక్ష పెట్టుకోవడం అంత అవసరమా..?  ఈ మధ్యన బి.హెచ్.ఇ.ఎల్,ఎన్.టి.పి.సి, ఐ.ఓ.సి.ఎల్ వంటి సంస్థలు “గేట్ (GATE)” పరీక్ష ద్వారా కొలువులనివ్వడం మంచి పరిణామం. నిజానికి ఇంజనీరింగ్ పట్టభద్రులకి ఐఐటీలు నిర్వహించే “గేట్”ని మించిన యోగ్యతా పరీక్ష ఏముంటుంది..? “గేట్”కి మల్లే అన్ని రకాల పట్టభద్రులకీ జాతీయ స్థాయి పరీక్ష ఒక్కటే నిర్వహించడం సాధ్యం కాదా..?  

(ఇంకా రాయాల్సి ఉంది.)

1 కామెంట్‌: